చంద్రబాబు పాపాలు మోసే ఖర్మ మాకు పట్టలేదు

Update: 2018-11-03 06:30 GMT

చంద్రబాబుకు సిద్ధాంతం అనేది లేదని... ఎవరితోనైనా కలుస్తారని, 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కలవడానికి నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతికి అంతే లేదని, ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికారని పేర్కొన్నారు. అటువంటి చంద్రబాబు పాపాలను తమ భుజాన వేసుకునే ఖర్మ తమకు పట్టలేదని పేర్కొన్నారు.

ఇక్కడ ఇమేజ్ దెబ్బతింటే ఢిల్లీ వెళ్తారు...

ఏపీలో ఇమేజ్ దెబ్బతింటే చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని, శాలువా కప్పి లడ్డూలు ఇస్తే వారు లొంగుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేదని, విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారని, రాహుల్ గాంధీ గుంటూరు వస్తే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఓ కార్యకర్తగా టీడీపీ - కాంగ్రెస్ పొత్తును ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. కనీసం పీసీసీని కూడా సంప్రదించకుండా చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటారని అధిష్ఠాన్ని ప్రశ్నించారు.

Similar News