Revanth Reddy : మద్యం తాగి మాట్లాడుతున్నారా? మతిలేక మాట్లాడుతున్నారా?

బీఆర్ఎస్ నేతలు ఇళ్లు కట్టించలేదు కానీ, ప్రతి వీధిలో బెల్ట్ షాపులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2023-11-13 11:59 GMT

బీఆర్ఎస్ నేతలు ఇళ్లు కట్టించలేదు కానీ, ప్రతి వీధిలో బెల్ట్ షాపులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మద్దూరులో వంద పడకల ఆసుపత్రి, స్టేడియంను కట్టిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వని ప్రభుత్వాన్ని ఆదరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఇళ్లు లేని ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని ఆయన ప్రజలకు చెప్పారు. కేసీఆర్ మతిలేక మాట్లాడుతున్నాడో.. మందేసి మాట్లాడుతున్నాడో తెలియదు కానీ రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు.

ఉచిత విద్యుత్తు ఇచ్చింది...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ చేసేది కూడా కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. మహిళలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తామని మరోసారి ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.
ఆరు గ్యారంటీలు...
ప్రతి నెల మహిళలకు రూ.2500లు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిరిగి ఫామ్ ఫౌస్ పంపించాలని ఆయన కోరారు. అవినీతి కుటుంబాన్ని తరిమికొట్టండని ఆయన పిలుపు నిచ్చారు. తొమ్మిదేళ్లు ప్రజలను దోచుకుని తిన్న కల్వకుంట్ల కుటుంబాన్ని తిరస్కరిస్తే తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడుతుందన్నారు. అందుకోసం అందరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కేసీఆర్ మాయ మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన కోరారు.
Tags:    

Similar News