Revanth Reddy : కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను పడింది

కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-10 12:00 GMT

కామారెడ్డి చుట్టూ భూములపై కేసీఆర్ కన్ను పడిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో రైతు బీరయ్య ధాన్యం కుప్పలపైనే గుండె ఆగి చనిపోయాడన్నారు. గజ్వేల్ ను బంగారు తునక చేస్తే కామారెడ్డికి ఎందుకు వచ్చి పోటీ చేశావని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీసీ నేత గంప గోవర్థన్ సీటే కావాల్సి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతం పలకబోతుందని ఆయన అన్నారు. కేసీఆర్ ను గజ్వేల్, కామారెడ్డిలో ఓడగొట్టి ఫాంహౌస్ కు పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు.

పోటీ చేయడానికి...
కామారెడ్డికి చెందిన రైతు లింబయ్య సెక్రటేరియట్ వద్దనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. గజ్వేల్ ప్రజలను నట్టేట ముంచి మళ్లీ ఇప్పుడు కామారెడ్డికి వచ్చాడననారు. కేసీఆర్ పోటీ చేసేందుకు సిద్ధిపేట, సిరిసిల్లలు లేవా? అని ఆయన ప్రశ్నించారు. మూడోసారి కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కావాలట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవిష్యత్ ను కామారెడ్డి నిర్ణయించబోతుందన్నారు ప్రజలు కష్టాలు తెలుసుకునేందుకు ఏనాడు సచివాలయానికి కేసీఆర్ రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు.
సీబీఐ విచారణకు సిద్ధమా?
పదేళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గంప గోవర్థన్ కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలని కోరుతున్నాడని అబద్ధపు మాటలు చెబుతున్నాడని అన్నారు. రైతు రుణమాఫీ జరగలేదని, పండించిన పంటను కొనుగోలు చేయడం లేదన్నారు. తాను ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపిస్తారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమా? అని రేవంత్ నిలదీశారు. మీ భూముల కొనుగోలు చేయడానికే మళ్లీ కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నాడని, అప్రమత్తంగా ఉండాలని రేవంత్ పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News