అలా అంటారు కానీ అంతా హంబక్.. పల్లా టూ పొన్నాల

కేసీఆర్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. క్లైమాక్స్‌లోనే ఆయనేంటో అర్థమవుతారు. అంత వరకూ బయటకు బాగానే కనపడుతుంది

Update: 2023-10-13 08:48 GMT

కేసీఆర్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. క్లైమాక్స్‌లోనే ఆయనేంటో అర్థమవుతారు. అంత వరకూ బయటకు బాగానే కనపడుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విష‍యంలోనూ అదే జరిగింది. మరికాసేపట్లో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో జనగామ టిక్కెట్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను దరిచేర్చుకోవడం కోసం జనగామ టిక్కెట్ ను పొన్నాలకు కన్ఫర్మ్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో జనగామతో పాటు తెలంగాణ రాజకీయాలు కూడా మారనున్నాయి.

టిక్కెట్‌ను అధికారికంగా...
జనగామ టిక్కెట్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మాత్రం టిక్కెట్ లేదని చెప్పారు. ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన కూడా ఆ పదవిని చేపట్టారు. జనగామ టిక్కెట్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఆయన కూడా జనగామ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతుండటంతో పల్లాకే టిక్కెట్ అనుకున్నారంతా. ఆయనకే బీఫారం ఇస్తారని అందరూ భావించారు. ఈ నెల 15వ తేదీన ప్రతి ఒక్క అభ్యర్థికి బీఫారం లు స్వయంగా కేసీఆర్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ టిక్కెట్ రేసులోకి పొన్నాల దూసుకు వచ్చారు.
ఎప్పటి నుంచో...
అయితే ఇది పైకి కనిపించే విషయం. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎప్పటి నుంచో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కొమ్మూరి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై కూడా పొన్నాల గత కొన్నాళ్ల నుంచి ఆగ్రహంతో ఉన్నారు. తనకు టిక్కెట్ రాదని ఆయన గట్టిగా భావించారు. తన వ్యతిరేక వర్గం ఢిల్లీలో బలంగా లాబీయింగ్ చేయడంలో సక్సెస్ అయ్యారని పొన్నాల విశ్వసించారు. ఇది ఇప్పటి నుంచి కాదు. గత కొన్ని నెలల నుంచి అసంతృప్తితో ఉన్న పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరికి టచ్‌‌లోకి వెళ్లినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ముఖ్యనేత నుంచి కూడా టిక్కెట్ హామీ లభించింది.
బీసీ కార్డుతో...
కానీ చివరి నిమిషంలో పార్టీని వీడి బీసీ కార్డుతో బయటకు రావాలని కారు పార్టీ నేత చెప్పడంతో ఇప్పుడు ఆయన బయటకు వచ్చారని సమాచారం. రేవంత్ రెడ్డిపైనా, పార్టీ అధినాయకత్వంపైనా విమర్శలు చేసి బయటకు వచ్చి బీసీలకు అన్యాయం జరిగిందని గొంతెత్తితే బీఆర్ఎస్ కు ఉపయోగమని భావించిన ఆ పార్టీ అధినేత పక్కా ప్రణాళికతో పొన్నాల విషయంలో వ్యవహరించారంటారు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. ఇలాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్ కు నష్టమైతే, బీసీ కార్డుతో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడానికే ఈ ఎత్తుగడ వేసిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News