KCR : ఓటు వేసేటప్పుడు ఆగమాగం కావద్దు

అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకుని ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు

Update: 2023-11-06 13:08 GMT

అన్ని పార్టీల అభ్యర్థుల గురించి తెలుసుకుని ఓటు వేయాలని కేసీఆర్ అన్నారు. నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.ఎన్నికలు వచ్చిన వెంటనే ఆగమాగం కావద్దని అన్నారు. వలసలు, కరువులతో అనేక దశాబ్దాల పాటు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కానీ తెలంగాణ రాస్ట్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క పని పూర్త చేసుకుంటూ ఇప్పుడు ఒక దశకు చేరుకున్నామని అన్నారు. సంక్షేమ పథకాలను అన్ని వర్గాల వారికీ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు వద్దన్నా నాడు ఏపీలో తెలంగాణను కలిపి అన్యాయం చేశారన్నారు. దాని ఫలితం కొన్నేళ్ల పాటు భరించాల్సి వచ్చిందన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న...
చివరకు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ వెళుతున్నామని తెలిపారు. ఈ విషయాలన్నీ మీ గ్రామాల్లో చర్చించాలన్నారు. ప్రతి రేషన్ కార్డుదారుడికి సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఏ పార్టీ ఎటువంటిదో మీరే నిర్ణయించుకోవాలన్నారు. పింఛను మొత్తాన్ని దశలు వారిగా పెంచుకుంటూ పోతూ ఐదు వేల రూపాయలకు చేరుతుందన్నారు. ఈ జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రులు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
అనేక మంచి కార్యక్రమాలు...
తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంచి కార్యక్రమాలు జరిగాయన్నారు. సాగునీరు, తాగునీరు అందరికీ అందించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రాణహిత ఎత్తిపోతల పధకం ద్వారా నీరు ఇద్దామని భావించానని అన్నారు. దానిపై అనేక కేసులు వేశారన్నారు. కుట్రలు చేశారన్నారు. ఈ మధ్యనే కేసులన్నీ గెలిచి ఆ పథకాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. నారాయణపేట, కొడంగల్ కు కూడా నీరు వచ్చేలా కాల్వ నిర్మాణం చేపడతామని తెలిపారు. అన్నీ ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.


Tags:    

Similar News