Telangana Elections : సర్వేలు ఒక్కోటి... ఒక్కోరకంగా... ఎవరిది నమ్మాలి?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. తమ నివేదికలను బయటపెడుతున్నాయి

Update: 2023-10-30 06:44 GMT

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. తమ నివేదికలను బయటపెడుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కోరకంగా రావడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అధికార బీఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని కొన్ని సర్వే సంస్థలు చెబుతుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరి కొన్ని సంస్థలు చేపట్టిన సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓటర్ల నాడిని కనుక్కుని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ, పోలింగ్ తేదీ నాటికి ఓటర్ మూడ్ ను బట్టే గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నది విశ్లేషకుల అంచనా.

ఆత్మసాక్షి సర్వేలో...
తెలంగాణలో తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ సర్వే నిర్వహించింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ సంస్థ జరిపిన సర్వేలో అధికార బీఆర్ఎస్ పార్టీకి 64 నుంచి 70 స్థానాలు వస్తాయని తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్ కు 37 నుంచి 43 స్థానాలు దక్కవచ్చని తేల్చింది. బీజేపీకి ఐదు నుంచి ఆరు స్థానాలు వస్తాయని తెలిపింది. ఎంఐఎంకు ఆరు నుంచి ఏడు స్థానాలు, ఇతరు ఒకటి నుంచి రెండు స్థానాలు, పోటీ పోటీగా ఆరు స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని ఈ సంస్థ తేల్చి చెప్పింది. 42.5 శాతంతో బీఆర్ఎస్, 36.5 శాతంతో కాంగ్రెస్ ఓట్లు షేర్లు పొందుతాయని శ్రీ ఆత్మసాక్షి సర్వేలో తేల్చింది.
పోల్ ట్రాకర్ సంస్థ మాత్రం...
ఇక మరో సంస్థ పోల్ ట్రాకర్ కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు రావడం విశేషం. 1,54,851 మంది అభిప్రాయాలను తీసుకున్నామని చెబుతున్న ఈ సంస్థ అక్టోబరు 1 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో సర్వేలు నిర్వహించామని స్పష్టం చేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్ కు 64 నుంచి 71 స్థానాలు, బీఆర్ఎస్ కు 39 నుంచి 43 స్థానాలు, బీజేపీకి మూడు నుంచి ఐదు స్థానాలు వస్తాయని తెలిపింది. ఎంఐఎం పార్టీకి రెండు నుంచి ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. ఇతరులు రెండు నుంచి ఆరు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది.


Tags:    

Similar News