ట్యాంకు బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2023-06-04 03:31 GMT

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై టెకీని ఓ ప్రైవేట్ బస్సు చిదిమేసింది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ శివారులోని శామీర్ పేట ఆలియాబాద్ లో లక్ష్మీనారాయణ కుటుంబంలో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి పెద్దకొడుకు మనోజ్ కుమార్(27) హైటెక్ సిటీలోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో పనిచేస్తున్నాడు. నైట్ షిప్ట్ కావడంతో రాత్రి విధులు ముగించుకుని తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే అతడు ప్రమాదానికి గురయ్యాడు. ట్యాంక్ బండ్ మీదుగా బైక్ పై వెళుతున్న మనోజ్ ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కిందపడిపోయిన మనోజ్ పైనుండి బస్సు దూసుకెళ్లింది. దీంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాచేపల్లిలో లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఆగివున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Similar News