లోకేష్ కు స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన విజయసాయి

Update: 2018-04-03 07:40 GMT

మమ్మల్ని జైలుకు పంపదలచుకున్నారా? అందుకు మేనేజ్ చేస్తున్నారా? అని వైసీపీ నేత విజయసాయి రెడ్డిమంత్రి లోకేష్ ను ప్రశ్నించారు. నిన్న లోకేష్ చేసిన విమర్శలపై విజయసాయి స్పందించారు. తనను హైదరాబాద్ లోనే ఉంటానని లోకేష్ విమర్శిస్తున్నారని, కాని లోకేష్ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ హైదరాబాద్ లోనే ఎందుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఉంటే ఢిల్లీలో ఉంటానని, లేకుంటే పార్టీ పనిమీద జిల్లాలు తిరుగుతుంటానని చెప్పారు. ఎంపీగా తాను ఏనాడు హైదరాబాద్ లో ఉండనని చెప్పారు. లోపాయికారీతనం ఒప్పందం చేసుకునే సామర్థ్యం తనకు లేదన్నారు విజయసాయి. పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న లోకేష్ తనను విమర్శించడంలో అర్థం లేదన్నారు. నాలుగేళ్లలో లోకేష్ ఎంత అవినీతికి పాల్పడ్డారో పవన్ కల్యాణ్ చెప్పడం జరిగిందన్నారు. ఏపీ అవినీతిలో ప్రధమ స్థానంలో ఉందని స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలిందన్నారు. పోలవరం, రాజధాని, భూ కుంభకోణం, తాత్కాలిక సెక్రటేరియట్, విదేశీ పర్యటనలపై టీడీపీ వివరణ ఇవ్వాలని విజయసాయి డిమాండ్ చేశారు.

Similar News