ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నడిచి పరపతిని తగ్గించుకోవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హితవు చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ నమ్మి ఆయన ఊబిలో కూరుకుపోవద్దని కూడా ముద్రగడ పవన్ ను హెచ్చరించారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ఆయనను నమ్మవద్దని కోరుతూ ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన జీవో నెంబరు 30ని హైకోర్టు కొట్టివేసినట్లు చంద్రబాబు మీతో చెప్పినట్లు వార్తల్లో చూశానని, అయితే జీవో నెంబరు 30ని సక్రమంగానే ఇచ్చినట్లు 1995లో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు దాచారన్నారు. ఏడు మాసాల్లో బీసీ కమిషన్ నివేదిక తెప్పించి రిజర్వేషన్లను అమలు చేస్తామని గత ఏడాది ఫిబ్రవరిలో హామీ ఇచ్చారన్నారు. అయినా మూడేళ్లు గడిచినా హామీ అమలుపర్చకపోగా ఎదురుదాడికి ప్రభుత్వం దిగిందన్నారు. కమిషన్ వేసి 18 నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆయన పవన్ కు గుర్తుచేశారు. చంద్రబాబును నమ్మి ఆయనతో ప్రయాణించి మీ పరపతిని తగ్గించుకోవద్దని ముద్రగడ లేఖలో పవన్ ను కోరారు.