దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో 2కోట్ల 60లక్షల మందికి రూ.లక్ష కోట్ల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే మూడేళ్లలో 5కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తొందన్నారు. అండమాన్, కన్యాకుమారి, కశ్మీర్లో అన్ని చోట్లా భాజపా జెండా ఎగురుతోందని వివరించారు. భారత పార్లమెంట్లో అత్యధికంగా దళితులు ఉన్నది భాజపాలోనేనని పేర్కొన్నారు.