చంద్రబాబుకు మోడీ బురద పూసారంటున్న పెద్దాయన

Update: 2016-12-10 07:16 GMT

నల్లధనం కట్టడి చేస్తున్నాం అనే పేరిట జనం పడుతున్న ఇబ్బందుల పట్ల తెలుగుదేశం ఎంపీ , సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ నిర్ణయం ద్వారా మోడీ ఒళ్ళంతా బురద పూసుకున్నాడని అయన ఎద్దేవా చేసారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే.. మోడీ ఆ తన శరీరానికి పూసుకున్న బురదను చంద్రబాబుకు కూడా అంటిస్తున్నాడని.. సీఎం ల కమిటీకి సారధిని చేయడం ద్వారా చంద్రబాబును ఇరుకున పెడుతున్నారని రాయపాటి వ్యాఖ్యానించడం విశేషం.

నిజానికి చంద్రబాబు నాయుడు సీఎం ల కమిటీ కి సారధ్యానికి అయిష్టంగానే ఒప్పుకున్నారు. అప్పటినుంచి టీడీపీ నాయకుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అయితే, పార్టీ విధాన పరంగా తాము నోట్ల రద్దుకు మద్దతు ఇస్తున్నందున ఎవరూ నోరు మెదపలేదు. చంద్రబాబు ఈ నిర్ణయం ద్వారా తను కూడా విమర్శలు భరించాల్సిన పరిస్థితిలో పడతారని తెలుగు పోస్ట్ ఇదివరలోనే కథనాలను అందించింది. ఇప్పుడు దానికి తగ్గట్లే జరుగుతోంది.

తెలుగు తమ్ముళ్లు బాహాటంగా తక్కువ మాట్లాడినా.. ముక్కుసూటిగా మాట్లాడడంలో తన మార్క్ తాను కలిగిఉన్న రాయపాటి సాంబశివరావు.. అచ్చంగా చంద్రబాబు కు మోడీ బురద పూస్తున్నారని ఎద్దేవా చేయడం గమనార్హం. మోడీ నిర్ణయాన్ని తొలినుంచి సమర్థిస్తున్న పార్టీ నాయకుల్లో కూడా అసహనం కట్టలు తెంచుకుంటున్న దనడానికి రాయపాటి వ్యాఖ్యలే నిదర్శనం అని పలువురు అంటున్నారు.

 

Similar News