వెస్ట్ ను వేస్ట్ చేశాడన్న జగన్

Update: 2018-05-21 13:46 GMT

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 167వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా లంచాలమయం చేశారని విమర్శించారు. కలెక్టర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు లంచాలు తీసుకుంటూ ప్రజల సమస్యలు గాలికొదిలేశారన్నారు. గత ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలు చూసి జిల్లా ప్రజలు అన్ని సీట్లు ఇస్తే, నాలుగేళ్లుగా చంద్రబాబు జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు ఇస్తామని చెప్పిన ఆయన కనీసం రోడ్లు కూడా వేయించలేదన్నారు. చంద్రబాబు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలకు రౌడీయిజంలో శిక్షణ ఇచ్చారని, మహిళలను జుట్టుపట్టుకుని ఎలా కొట్టాలో, మట్టి నుంచి ఇసుక వరకు ఎలా దోచుకోవాలో శిక్షణ ఇచ్చారని విమర్శించారు.

జగన్ బహిరంగసభలో అపశృతి

తాడేపల్లిగూడెంలో జరిగిన జగన్ బహిరంగసభలో అపశృతి దొర్లింది. జగన్ సభాస్థలికి చెరుకున్న సమయంలో జనం ఎక్కువవడంతో తోపులాట జరిగింది. దీంతో సభకు వచ్చిన ఓ మహిళ కాలువలో పడిపోయింది. ఆమె అపస్మారక స్థతిలోకి వెళ్లడంతో, వైసీపీ నేతలు ఆసుప్రతికి తరలించారు.

Similar News