కుప్పంలో చంద్రబాబుపై జగన్ ఫైర్

తోడబుట్టిన వారిని సైతం మోసం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలందరికీ అన్నగా ఉంటానంటే అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి [more]

Update: 2019-04-05 06:39 GMT

తోడబుట్టిన వారిని సైతం మోసం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలందరికీ అన్నగా ఉంటానంటే అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చంద్రబాబు స్వంత నియోజకవర్గం కుప్పంలో జగన్ ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు తల్లి అమ్మనమ్మకు ఉన్న ఆస్థిని ఆయన తోడబుట్టిన వారికి సమానంగా పంచకుండా చంద్రబాబు మోసం చేసి తన కుమారుడు లోకేష్ పేరుపైకి మార్చుకున్నారని గుర్తు చేశారు. తన తమ్ముడిని సైతం మోసం చేశారని ఆయన ఎన్నోసార్లు చెప్పారన్నారు. పిల్లనిచ్చిన మామకు సైతం వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ, జెండా, పదవి, ట్రస్ట్ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రగిరిలో ఓడిపోవడంతో బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకొని మోసం చేస్తూ 30 ఏళ్లుగా చంద్రబాబు గెలుస్తున్నారని అన్నారు.

30 ఏళ్లుగా ఏం అభివృద్ధి చేశారు ?

30 ఏళ్లు గెలిచి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర సగటి కంటే కుప్పంలో అక్షరాస్యత తక్కువగా ఉందని చెప్పారు. ఇక్కడ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు సైతం చంద్రబాబు నిర్మించలేదని, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ కళాశాలలు కట్టించారని గుర్తు చేశారు. కుప్పంకు నీరిచ్చేందుకు ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్ భావిస్తే తనను ప్రజలు మరిచిపోతారనే భయంతో తమిళనాడు ప్రభుత్వంతో కేసు వేయించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పంలో బీసీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళిని నిలబెడుతున్నామని, ఆయనను గెలిపిస్తే మంత్రిని చేసి కుప్పం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పంలో జగన్ సభలో ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది.

Tags:    

Similar News