ఉత్తమ్... వెంటనే రాజీనామా చేయ్..!

Update: 2018-12-14 11:44 GMT

టీఆర్ఎస్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాలూచీ పడ్డారని, కుంభకోణాలు బయటపెట్టకుండా ఉండటానికి కేసీఆర్ చెప్పినట్లు విని తెలంగాణలో కాంగ్రెస్ ను సర్వనాశనం చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తుంటే... తెలంగాణలో మాత్రం ఉత్తమ్ పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ 21 సీట్లు గెలిస్తే ఇప్పుడు 19 సీట్లే గెలిచిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ 2 స్థానాలకే పరిమితమైందన్నారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ ఉద్యమకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. పార్టీ ఘోరంగా ఓడిపోతే రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా సమావేశాలు ఎలా పెడుతున్నారని గజ్జెల కాంతం ప్రశ్నించారు.

Similar News