మోదీ కోసం ప్రాణమిస్తానన్న టీఆర్ఎస్ నేత తనయుడు

Update: 2018-06-28 07:42 GMT

తాను భారతీయ జనతా పార్టీని వీడేది లేదని, ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రాణమైనా ఇస్తానని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తనయుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తనను డీఎస్ బీజేపీలోకి పంపారన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... తాను తండ్రి, అన్నపై ఆధారపడి రాజకీయాలు చేయడానికి కవితలా కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి కుటుంబాన్ని తీసుకురావొద్దన్న కనీస అవగాహన కూడా ఎంపీకి లేకపోవడం దారుణమన్నారు. తమ కుటుంబంలో తన తండ్రి డిక్టేటర్ కాదని, తాను బానిసను కానని స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పుకాదని, గతంలో విద్యాసాగర్ రావు బీజేపీలో, ఆయన సోదరుడు రాజేశ్వర్ రావు సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Similar News