అంతా ఏకమయినా

తెలంగాణ వస్తే బతుకు బాగుపడుతుందన్నారు నాడు కేసీఆర్….. తెలంగాణ ఉద్యమానికి అంతామద్దతు తెలిపితే మన తెలంగాణ మన ముంగిటకే వస్తుందని చెప్పారు. దీనికి అన్ని వర్గాలు ఓకే [more]

Update: 2019-10-21 10:16 GMT

తెలంగాణ వస్తే బతుకు బాగుపడుతుందన్నారు నాడు కేసీఆర్….. తెలంగాణ ఉద్యమానికి అంతామద్దతు తెలిపితే మన తెలంగాణ మన ముంగిటకే వస్తుందని చెప్పారు. దీనికి అన్ని వర్గాలు ఓకే చెప్పాయి. ప్రతిపక్షాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలా ఒకటేమిటి తెలంగాణలో ఉన్న కార్మికులంతా కలిసి వచ్చారు. సకల జనుల సమ్మెలో పాల్గొని అనుకున్నది సాధించుకున్నారు. ఇదంతా కూడా ఆరేళ్ల క్రితం జరిగింది.

కాలం కలిసివచ్చిందా….?

తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ మళ్లీ
రెండోసారి మెజార్టీ సాధించి ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. సచివాలయాన్ని కూల్చేసి ఎర్రమంజిల్ లో నూతన భవననిర్మాణం, ఎం.ఐ.ఎంతో దోస్తానా, తక్కువ ధరలకే ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టడం వంటి అనేక నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కానీ ఇంత కాలం ప్రతిపక్షాలు ఏమిచేయలేని పరిస్థితి. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు నష్టం చేకూర్చే నిర్ణయాలెన్ని జరుగుతున్నా ప్రతిపక్షాలు కేవలం విమర్శలే చేశాయి. ఇప్పుడు ప్రతిపక్షాలకు కాలం కలిసివచ్చింది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెతో అంతా ఏకమయ్యారు. కలిసి రోడ్లపై బైఠాయిస్తున్నారు. కేసీఆర్ పై దండయాత్ర చేస్తున్నారు.

ఫుల్ స్టాప్ పడేదెప్పుడు….

ఆరేళ్ల తర్వాత ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. ఆర్టీసీ సమ్మెతో అంతా కలిసి ముందుకు సాగుతున్నారు. ఆరేళ్ల క్రితం ఒకరిని ఒకరు దూషించుకున్నవారే ఇప్పుడు చేయిచేయి కలిపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో రోడ్లపై బైఠాయిస్తున్నారు. ప్రగతి భవన్ ను ముట్టడించారు. ఓయూ విద్యార్థులు సైతం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సిబ్బంది, ఇలా ఒక్కరొక్కరూ తమ అసంతృప్తులను వెళ్గగక్కుతున్నారు. అరెస్టులు, రాస్తారోకోలు, బంద్ లు, ధర్నాలతో తెలంగాణలో అంతా అలజడి రేగుతోంది. 17 రోజులుగా సాగుతున్న ఈ పరిణామాలు చూస్తే మరో సకల జనుల సమ్మెలా తలపిస్తోంది. మరి దీనికి ఫుల్ స్టాప్ పడేదెప్పుడని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

 

 

Tags:    

Similar News