బ్రేకింగ్ : రేవంత్ ప్రచారంలో ఉండగానే....?

Update: 2018-09-27 03:52 GMT

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు హైదరాబాద్, కొడంగల్ లలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. ఢిల్లీ ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు స్థానిక ఆదాయపు పన్ను శాఖతో సహా మొత్తం ఐదు బృందాలు మూడు చోట్ల సోదాలు జరుపుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి కొడంగల్ లో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

శ్రీవారిని దర్శించుకుని......

నిన్ననే ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని కొడంగల్ చేరుకున్నారు. ఇంట్లో పనిమనుషులు తప్ప ఎవ్వరూ లేరని, ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది రాజకీయ కక్ష మాత్రమేనని, కర్ణాటకలో ఎన్నికలకు ముందు జరిగిన దాడుల తరహాలోనే ఇక్కడ కూడా ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం పదిహేను చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి.

Similar News