దారుణానికి తెగ‌బ‌డ్డ ప్రేమోన్మాది

Update: 2018-07-06 06:51 GMT

తమిళనాడులో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక అమ్మాయిని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు.

ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని...

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా రాజెపాలెంలో గత నెల 20న ఓ ఉన్మాది అందరూ చూస్తుండగానే యువతిపై దాడి చేశాడు. మదీశ్వరన్‌ అనే యువకుడు తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతకంగా నరికాడు. యువతి ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు. అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. సీసీ ఫుటేజీ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Similar News