విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. విశాఖలో నిర్వహించిన నిరసన కవాతులో ఆయన మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు సిగ్గు ఎక్కువగా ఉండేదని, ఓ సారి సుస్వాగతం సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతున్న సమయంలో వేలాది మంది ప్రజలు చూస్తుండగా బస్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలని చెప్పారని తెలిపారు. అది తనకు సిగ్గు అనిపించిందని, దీంతో తన వదిన సురేఖకు ఫోన్ చేసి తాను సినిమాలు చేయలేనని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే, పవన్ తర్వాత ఇటువంటి సమస్యల నుంచి బయటపడి దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా ఎదిగి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.