బాబు వేసే ఆ కమిటీలో...?

Update: 2018-09-09 04:49 GMT

కాసేపట్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశం కానున్నారు. పొత్తులపై ఆయన ఈరోజు క్లారిటీ ఇవ్వనున్నారు. పొత్తులపై నిర్ణయాధికారం తెలంగాణ టీడీపీ నేతలకే అప్పగిస్తున్నానని చంద్రబాబు నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పినప్పటికీ, ఆయన ఆదేశాల మేరకే కాంగ్రెస్ తో కలసి నడవాలన్న నిర్ణయం దాదాపు జరిగిపోయింది. టీడీపీ ముఖ్యనేతలైన ఎల్. రమణ, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావులకు పిలుపువచ్చింది.

కమిటీ ద్వారానే సంప్రదింపులు......

కాంగ్రెస్ తో చర్చలు జరిపేందుకు చంద్రబాబు ఒక కమిటీని ఈ సమావేశంలో నియమించనున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ తమకు 30 సీట్లు కావాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ తో చర్చలు జరిపేందుకు ఒక కమిటీని నియమించి చర్చల ద్వారా సీట్ల పంపకం జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరికాసేపట్లో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం ప్రారంభం కానుంది.

Similar News