ప్రేమించి..పెళ్లి చేసుకున్నా ...చంపేసిందే....!

Update: 2018-08-01 02:19 GMT

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేయించుకుని ఏడడుగుల బంధానికి ఓ వివాహిత కళంకం తెచ్చింది. ప్రియుడి మోజులోపడి తాళికట్టిన భర్తనే కడతేర్చి సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి కిరోసిన్ పోసి తగులబెట్టింది.

మద్యానికి బానిసై.....

వికారాబాద్ జిల్లా కు చెందిన ఆనంద్ గత 15 ఏళ్ళ క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. నగరంలోని వివిధ హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో పురానాపుల్ కి చెందిన మహేశ్వరిని 2010 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ముకేష్ (7) , భాను (5) సంతానం. కాలక్రమేణా ఆనంద్‌ మద్యానికి బానిసగా మారి తన భార్య మహేశ్వరీని పట్టించుకోకుండా పోయాడు. ఆనంద్ మిత్రుడైన సంజయ్‌ అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చిపోతుండేవాడు. మహేశ్వరీ సంజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి భర్త ఆనంద్ అడ్డుతొలగించుకోవడానికి కుట్రపన్నారు.

మూడు నెలల క్రితం.....

గత మే నెల 18వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆనంద్‌ను సంజయ్‌, మహేశ్వరీ ఇద్దరు కలిసి హత్య చేశారు. అనంతరం గండిపేట మండలం గందంగూడలోని సంజయ్‌ సొంత భూమిలో మృతదేహాన్ని తరలించి కిరోసిన్ పోసి తగులబెట్టారు. రెండు రోజుల తర్వాత అంటే మే 20వ తేదీన తన భర్త కనిపించడంలేదంటూ నిందితురాలు మహేశ్వరీ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆనంద్ భార్యను అనుమానించారు. వెంటనే పోలీసులు అమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.నిందితులిద్దరిని గంధంగూడలోని సంజయ్ భూముల వద్దకు తీసుకుపోగా అక్కడ...కాలిపోగా మిగిలిన బూడిదతోపాటు ఎముకలు లభ్యమయ్యాయి. కాలిన ఎముకలను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నారు.

Similar News