బాబాయి వరుస వ్యక్తిని పెళ్లి చేసుకుందని...?

Update: 2018-08-23 09:45 GMT

వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపైనే పగ పెంచుకున్నాడో తండ్రి. అదను కోసం ఎదురుచూసి... ఇంటికొచ్చిన కూతురిని దారుణంగా హత్య చేశాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామానికి చెందిన నర్సింహ్మ కూతురు విజయ నాలుగేళ్ల క్రితం తనకు వరుసకు బాబాయి అయ్యే సురేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వివాహాన్ని నర్సింహ్మ ఒప్పుకోలేదు. దీంతో తండ్రికి దొరక్కుండా సురేష్-విజయ దంపతులు వివిధ ప్రాంతాల్లో రహస్యంగా కాపురమున్నారు. అయితే, బాబాయి వరుస వ్యక్తిని పెళ్లి చేసుకుని తన పరువు తీసిందని పగ పెంచుకున్న నర్సింహ్మ కూతురి ఆచూకీ కోసం అనేక ప్రాంతాలు తిరిగినా వారు జాడ దొరకలేదు.

మామూలుగా నటించి...

విజయకు ఓ కుమారుడు కూడా పుట్టాడు. తనపై తండ్రికి కోపం తగ్గి ఉంటుందని భావించిన విజయ తల్లిదండ్రులపై ప్రేమతో వారిని చూసేందుకు ఇంటికి వచ్చింది. మొదట సాదారణంగానే ఉన్నట్లు నటించాడు నర్సింహ్మ. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి కూతురిపై దాడిచేసి కత్తితో మెడ కోశాడు. విజయ మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. విజయ మృతి గురించి తెలుసుకున్న భర్త, తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు.

Similar News