కర్ణాటకలో రాజకీయ హైడ్రామా రాజ్ భవన్ గేటు వద్దకు చేరింది. తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని, తమకు అధికారం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు బస్సులో చేరుకున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి ఎమ్మెల్యేలను తీసుకుని రాజ్ భవన్ కు వెళ్లగా, భద్రతా సిబ్బంది ఆయనను లోనికి అనుమతించలేదు. దీంతో ఆయన భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం అందరు ఎమ్మెల్యేలను కాకుండా కేవలం పదిమందిని మాత్రమే లోనికి అనుమతించారు. దీంతో గవర్నర్ ముందు ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేయించాలనుకున్న కుమారస్వామి ప్రణాళిక ఫలించలేదు.