బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు వైదొలిగారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అమిత్ షాకు రాజీనామా లేఖను కూడా పంపారు. హరిబాబును బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి కొత్త వారిని నియమిస్తారన్న ఊహాగానాలు చాలా రోజుల నుంచి విన్పిస్తున్నాయి. ఆయన స్థానంలో సోము వీర్రాజు నియమితులయ్యే అవకాశముందని కూడా పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ సర్కార్ పై ఘాటైన విమర్శలు చేయడంలో హరిబాబు విఫలమయ్యారని ఆ పార్టీ నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిబాబు రాజీనామా చేయడంతో ఏపీ బీజేపీకి కొత్త సారథి త్వరలోనే నియమించనున్నారు.