గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా మారిందే...!

Update: 2018-06-10 01:43 GMT

హైదరాబాద్ గ్యాంగ్ స్టర్లకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసి సిటీలో తలదాచుకోవడానికి నేరగాళ్లకు సేఫ్ జోన్ గా మారింది. ఇటీవల నగరంలో ఓ పాకిస్తానీతో పాటు..మూడురాష్ట్రాలకు మోస్ట్ వాటెండ్ గా ఉన్న సంపత్ నెహ్రా పట్టుబడటం పోలీసులకు మింగుడుపడని వ్యవహారమైపోయింది. నిత్యం కార్డన్ సెర్చ్ లు నిర్వహించి తనిఖీలతో హోరెత్తించినా ఫలితం లేకుండా పోయిందన్న అపవాదు మూడుకమిషనరేట్లకు మిగిలింది. హైదరాబాద్ మూడు కమిషనరేట్లు..ముగ్గురు కమిషనర్లు.. 30 వేల మంది పోలీసులు.. నిత్యం కార్డన్ సెర్చ్ లతో హోరెత్తించే ఖాకీలు. అనుమానితులు కనిపిస్తే చాలు పట్టుకొని పూర్తి డేటా తీసే ఎక్స్ పర్ట్ లు. బట్ ఎంత చేసిన ఎక్కడో ఓ చోట ప్లాన్ తలకిందులై అట్టర్ ప్లాప్ పోలీసులుగా మిగిలిపోతున్నారు. సిటీలో ఉన్న నేరగాళ్లను పారిపోయే లా చేసి నేరాల నుండి పూర్తి విముక్తి కలిగించాలన్న సంకల్పంతో ప్రారంభించిన కార్డన్ సెర్చ్ నామమాత్రపు తనిఖీలకే పరిమితమైందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది.

హర్యానా పోలీసులు వచ్చేంత వరకూ.....

ఇటీవల హైదరాబాద్ లో గత కొంతకాలంగా తలదాచుకొని, ఇక్కడి రేషన్, ఆధార్ కార్డు పొంది దర్జాగా జీవితం గడిపాడు ఓ పాకిస్తానీ. ఈ విషయం అతని భార్య సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు మన సిటీ కాప్స్ కి పాకిస్తానీ ఉన్నట్లు సమాచారమే లేకుండా పోయింది. హై నిఘా విభాగాలు.. ఇంటలిజెన్స్ వింగ్స్, షాడో టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు..ఉన్నప్పటికీ కూడా కరుడుగట్టిన నేరగాళ్ల వివరాలు తెలుసుకోవడంలో ఘోరంగా విఫలమౌతున్నారు.తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మూడురాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న సంపత్ నెహ్రాను హర్యానా పోలీసులు వచ్చిన పట్టుకు పోయే వరకు పోలీసులకు తెలియకుండా పోయింది. గోకుల్ చాట్ లో నిత్యం కార్డన్ సెర్చ్ చేసే పోలీసులకు మోస్ట్ వాటెండ్ ఇక్కడే ప్లాట్ అద్దెకు తీసుకున్నాడన్న విషయం హర్యానా పోలీసులు వచ్చి చెప్పేదాక తెలియలేదు. అయితే సంపత్ నెహ్రా తలదాచుకున్న తీరుపై అధికారులను ప్రశ్నిస్తే గోకుల్ ప్లాట్స్ మధ్య కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులకు, మియాపూర్ పోలీసులకు మధ్య సరిహద్దు సమస్య ఉండటం వల్లే విఫలమైనామని కుంటిసాకులు చెబుతున్నారు. అటు పాకిస్తానీ, ఇటు కరుడుగట్టిన నేరస్తులు, రోహింగ్యాలు హైదరాబాద్ లో తలదాచుకున్నా మన పోలీసులకు సమాచారం తెలియక పోవడం విడ్డూరంగా ఉంది. కార్డన్ సెర్చ్ లో వాహనాల సీజ్ విషయంలో చూపే శ్రద్ధ మన పోలీసులు కరుడుగట్టిన నేరస్తుల ఆగడాలు.. వారి కదలికలపై నిఘా పెట్టడం లేదన్న ఆరోపణలు లేక పోలేదు. ఇటీవల వరుసగా ఎదురైన ఘటనలు చూస్తే ఇతర ప్రాంతాల్లో నేరస్తులు తలదాచుకోవడానికి హైదరాబాద్ సేఫ్ జోన్ గా మారిందనే చెప్పుకోవాలి.

Similar News