ఇప్పటివరకూ నా మంచితనాన్నే చూశారు… బాబు వార్నింగ్

పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో పదిశాతం స్థానాలు తమ పార్టీకి దక్కేవని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి వైసీపీ [more]

Update: 2021-02-22 08:04 GMT

పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో పదిశాతం స్థానాలు తమ పార్టీకి దక్కేవని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి వైసీపీ పంచాయతీలను కైవసం చేసుకుందని చెప్పారు. అయినా ప్రాణాలకు ఎదురొడ్డి తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారన్నారు. చీకట్లో గెలిచినట్లు ప్రకటించుకున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన చోట రీకౌంటింగ్ పెట్టి వైసీపీ మద్దతుదారును గెలిచినట్లు ప్రకటించుకున్నారన్నారు. ఇష్టానుసారంగా చేసినా ఎన్నికల కమిషన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికల కమిషన్ పనిచేయలేదు….

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగలేదన్నారు. న్యాయస్థానం ఆదేశించినా ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదన్నారు. తమ పార్టీ తరుపున 127 ఫిర్యాదులు సాక్షాధారాలతో ఎన్నికల కమిషన్ కు పంపామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేని నిస్సాహయతలో ఉన్నారన్నారు. ఆరోజు శేషన్ ఢిల్లీలో ఉంటే గల్లీలోనూ భయపడ్డారన్నారు. కానీ ఇప్పుడు అధికారులు ఎవరూ ఎన్నికల కమిషన్ కు భయపడలేదన్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్నారు చంద్రబాబు. ప్రజలు తిరుగుబాటు చేసిన చోట అధికారులు వెనక్కు తగ్గారన్నారు. భయపడిన చోట అధికారులు ఇష్టారాజ్యంగా వన్ సైడ్ చేశారన్నారు. తనకు రాత్రి 3గంటల వరకూ తమ పార్టీ నేతలు ఫోన్లు చేస్తూనే ఉన్నారని చంద్రబాబు చెప్పారు.

అధికారులు తొత్తులుగా మారారు…

గత ఎన్నికల కంటే 6 శాతం పోలింగ్ తగ్గిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటర్లను బెదిరించారన్నారు. తమ కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హింసించినా అనేక చోట్ల అధికార పార్టీకి ఎదురు నిలిచి నిలబడ్డారన్నారు. జమిలి ఎన్నికలు వచ్చిందాకానే వీరి ఆటలు సాగుతాయని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి విర్రవీగాడని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనే వైసీపీ ఓడిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇదే ప్రజల తిరుగుబాటు అని చంద్రబాబు వైసీపీకి గుర్తు చేశారు. అధికారులు ఊడిగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంతవరకూ తన మంచితనాన్నే చూశారని, ఇకపై మరో కోణం చూస్తారని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు మంచివాడని అనుకుంటే పొరపాటు పడినట్లేనని, తాను అధికారంలోకి వస్తే ఊడిగం చేసిన అధికారుల అంతు చూస్తానని చంద్రబాబు హెచ్చరించారు.

తాను ఆరోజు ఆ పని చేసి ఉంటే….

ఈ ముఖ్యమంత్రి ఫేక్ అని అన్నారు. బాబాయిని ఎవరు చంపారో చెప్పమంటే ఇంతవరకూ నోరు మెదపలేదని చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ విషయంలో తనకేమీ తెలియదని జగన్ పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. అన్నీ తెలిసే ఏమీ తెలియనట్లు జగన్ నాటకాలాడుతున్నారని చంద్రబాబు అన్నారు. పధ్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, తన దగ్గర కుప్పిగంతులు చెల్లవన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ నడుస్తుందన్నారు. తాను అధికారం కోసం పోరాడటం లేదని, ప్రజలు కోసం, రాష్ట్రం కోసమే పోరాడుతున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల, పుంగనూరులో గుద్దుకుంటే ఏం పీక్కునేవారని చంద్రబాబు ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో మిడ్ నైట్ డ్రామాలు జరగవని చంద్రబాబు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే పన్నులు పెంచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News