హైదరాబాద్ చేరనున్న గాలి వారి సంబరాలు

Update: 2016-11-17 16:37 GMT

గత కొంత కాలంగా మీడియాలో రెండే వార్తలు ప్రసారంలో వున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్య కాగా మరొకటి గాలి జనార్దన్ రెడ్డి ఇంట ఆయన తనయురాలు బ్రాహ్మణి రెడ్డి పరిణయ వేడుక. ఇంతటి పాపులారిటీ ఈ పరిణయ వేడుకకి దక్కటానికి కారణం ఈ వేడుక ట్రైలర్ లకు, సెట్ లకు, ఆహ్వాన పత్రికలకు గాలి వారు వెచ్చించిన ఖర్చే. నిన్న (బుధవారం) కర్ణాటకలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇప్పటి వరకు ఐన ఖర్చు దాదాపు 650 కోట్ల రూపాయలు అని వినికిడి. గాలి వారి వేడుకలు ఇంతటితో ఆగిపోలేదు. ఈ 20 వ తేదీన హైద్రాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి.

స్వతహాగా కర్ణాటక రాష్ట్ర భారాతీయ జనతా పార్టీ నాయకులు ఐన గాలి జనార్దన్ రెడ్డి కి దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి గా వున్న నాటి నుంచి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ మరియు ఇతర రాజకీయ పార్టీ ప్రముఖులు, తెలుగు సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు వున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ఈ వేడుకలకు గైరుహాజరు కావటానికి తెలుగు రాష్ట్ర రాజకీయ నేతలు నిశ్చయించుకున్నారు. అయితే తాను హైద్రాబాద్లో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ కి తన శ్రేయోభిలాషులు ఐన తెలుగు నేతలు అందరూ హాజరు అవుతారని గాలి విశ్వసిస్తున్నారంట.

రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకూడదని యోచిస్తున్న జగన్ మోహన్ రెడ్డి మరి 20 వ తారీఖున గాలి వారి విందుకు హాజరు అవుతారో లేదో అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది.

Similar News