సౌత్ ఆఫర్స్ పై పెద్దగా ఆసక్తి చూపని భామ

Update: 2017-05-31 11:43 GMT

2014 లో తెలుగులో విడుదలైన ముకుంద చిత్రంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కథానాయిక పూజ హెగ్డే తరువాతి కాలంలో అక్కినేని నాగ చైతన్య నటించిన ఒక లైలా కోసం చిత్రంలో కథానాయికగా నటించింది. కాగా ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో తెలుగు ఆఫర్స్ ని పక్కన పెట్టి బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ ని నమ్ముకుని బొంబాయి వెళ్ళింది పూజ హెగ్డే. అయితే వచ్చిన అవకాశం గొప్పదే కానీ హ్రితిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం మోహేనజదరో సినిమా ఆడకపోవడంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా అమ్మడికి నిరాశే మిగిల్చింది.

ఆ చిత్ర ఫలితం ఇచ్చిన షాక్ తో ఆశలు చంపుకుని తిరిగి టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం చిత్రంలో కథానాయికగా నటించటానికి అంగీకరించి ఇప్పుడు ఆ చిత్ర షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పాటలు మినహా టాకీ పార్ట్ తన భాగాన్ని పూర్తి చేసుకున్న పూజ హేగ్దే ఇప్పుడు తిరిగి బాలీవుడ్ పై కన్నేసినట్టు కనిపిస్తుంది. దువ్వాడ జగన్నాథం ఇంకా విడుదల కాకముందే దక్షిణాది ఫిలిం మేకర్స్ తెచ్చే కథలు వినటానికి విముఖత చూపిస్తుందట ఈ బ్యూటీ. మరి దువ్వాడ జగన్నాథం ప్రమోషన్ పనులు పూర్తి కాగానే తిరిగి బొంబాయి చెక్కేసే ఆలోచనలో ఉందేమో పూజ హెగ్డే తనకే తెలియాలి.

Similar News