సూపర్ స్టార్ సినిమాకి కొరటాల తన సెంటిమెంట్ పాటిస్తున్నాడు

Update: 2017-05-09 12:39 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది బ్రహ్మోత్సవం ఆశించని ఫలితం ఇవ్వకపోవటంతో తన అభిమానులని ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రంతో అలరించాలని శ్రమిస్తున్నాడు కానీ ఆ చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతూ వచ్చింది. దానితో ఇప్పటికే ప్రారంభం కావలసిన కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించవలసిన తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభం వాయిదా పడింది. చాలా తక్కువ వర్కింగ్ షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి సెప్టెంబర్ నాటికల్లా ప్రేక్షకుల ముందుకు తేవటానికి దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అయితే సినిమా మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవటంతో సెప్టెంబర్ నాటికి సినిమా విడుదల జరిగే అవకాశం లేదు.

ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసేసిన కొరటాల శివ తాను దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం మిర్చి నుంచి తాను పాటిస్తున్న సెంటిమెంట్ ని ఇప్పుడు కూడా పాటిస్తున్నాడు. కొరటాల శివ తన ప్రతి సినిమా కి స్క్రిప్ట్ పూర్తవగానే వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద స్క్రిప్ట్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆనవాయితీగా పాటిస్తున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలకు కూడా స్క్రిప్ట్ స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన అనంతరమే సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఆ చిత్రాలు ఎంతటి బ్లాక్ బస్టర్స్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మహేష్ బాబు కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ కి తన సెంటిమెంట్ ప్రకారం అన్ని ప్రత్యేక పూజలని వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి జరిపించాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న స్పైడర్ పూర్తి చేసుకుని వేగంగా కొరటాల శివ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళటమే ఆలస్యం. రానున్న నెలలో కొరటాల శివ చిత్రం సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభించుకోనుందని తెలుస్తుంది.

Similar News