షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కోట...!

Update: 2016-03-15 14:46 GMT

ఏపాత్రలో నటించినా అందులో పరకాయ ప్రవేశం చేసి జీవించే నటుడు కోటశ్రీనివాసరావు. కాగా ఆయన ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు చెప్పడంతో పాటు కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఈ సందర్బంగా ఆయన బ్రహ్మానందంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఆయన మాట్లాడుతూ..బ్రహ్మానందం గత ఆరేళ్లుగా ఒకే వేషం వేస్తూ బతుకుతున్నాడు. ఆయనకు కోపం వచ్చినా ఫర్వాలేదు. ఆయన అద్బుతమైన నటుడు. ఎటువంటి పాత్రనైనా చేయగలడు. చెప్పి చేయించుకునే వారు ఉండాలి. ఆయనకు రోటీన్‌ వేషాలు ఇస్తున్నారు. ఆయన నటించే ప్రతిపాత్రలో ఆయన్ను ఎవడో ఒకడు కొట్టడం, అది చూసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారని దర్శకులు భావిస్తున్నారు. ఇదేనా కామెడీ అంటే? అని ప్రశ్నించాడు. ఒకప్పుడు హీరో పాత్రలకు సరిసమానంగా విలన్‌ పాత్రలు ఉండేవి. రావుగోపాలరావు, సత్యనారాయణతో పాటు నా హయాంలో కూడా విలన్‌ పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు హీరోల డామినేషన్‌ పెరిగిపోయింది. కామెడీతో సహా అన్ని రకాల షేడ్స్‌ను హీరోలే చేస్తున్నారు. దీంతో విలన్లు జోకర్లుగా మిగిలిపోతున్నారు. నానాపాటేకర్‌, నసీరుద్దీన్‌షా వంటి గొప్పనటుల పక్కన చిన్న వేషం వేయడానికైనా నేను రెడీ. కానీ నటనరాని, తెలుగు రాని వారితో మాత్రం నటించను... అంటూ తన మనసులోని అభిప్రాయాలను తెలిపారు. ఆయన చెప్పిన ప్రతిమాటా అక్షరసత్యమే అయినా ఆయన హయాంలో కూడా కోట, బాబూమోహన్‌ల మధ్య కొట్టుడు కార్యక్రమాలే ఎక్కువగా కనిపించి, జనాలను విసిగించిన సంగతి మాత్రం ఆయనకు తెలియదా? అనేదే అసలు ప్రశ్న

Similar News