శంకర్ సినిమా సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ కథ

Update: 2017-01-14 12:30 GMT

తమిళ దర్శకుడు శంకర్ తన కెరీర్ ప్రారంభం నుంచే భారీ బడ్జెట్ చిత్రాలలో సామాజిక అంశాన్ని చర్చిస్తూ వినూత్న కథలని తెరకెక్కిస్తున్నారు. అలా ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిన సామాన్యుడి చేతికి ఒక రోజు ముఖ్య మంత్రి బాధ్యతల కాన్సెప్ట్. అదే యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ ఒకే ఒక్కడు. ఈ చిత్రంలో అర్జున్, రఘువరన్ ల నటన, అర్జున్-మనీషా కొయిరాలా ల మధ్య కెమిస్ట్రీ, రెహ్మాన్ సంగీతం ఇలా దేనికది అదనపు బలమై సినిమాని సూపర్ హిట్ చేశాయి. దానితో ఈ చిత్రం పై బాలీవుడ్ కన్నేయగా అప్పటి సక్సెసఫుల్ హీరో అనిల్ కపూర్ తో ఒకే ఒక్కడు చిత్రాన్ని హిందీ లో నాయక్ గా రీమేక్ చేశారు. దక్షిణాదిన సంచలన విజయం నమోదు చేసిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఘోర పరాజయం చవి చూసింది.

ఇదంతా 16 సంవత్సరాల క్రితం 2001 సంగతి. ఇన్ని సంవత్సరాల తరువాత ఒకే ఒక్కడు సీక్వెల్ చేయాలనే ఆలోచన శంకర్ కి రాలేదు కానీ నాయక్ కి సీక్వెల్ తీయాలనే ఆలోచన కార్పొరేట్ నిర్మాణ సంస్థ ఐన ఈరోస్ వారికి కలిగింది. రానున్న ఏడాదికి నాయక్ 2 రూపుదిద్దుకోనుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈరోస్ సంస్థ ఒకేసారి చేపట్టనున్న పలు ప్రాజెక్ట్స్ వివరాలు వెల్లడిస్తూ నాయక్ సీక్వెల్ విషయాలు కూడా చెప్పారు. బాహుబలి, భజరంగి భాయ్ జాన్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా బాగా పాపులర్ ఐన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ కి కథ సిద్ధం చేస్తున్నారు. మరి నేటి తరం అనిల్ కపూర్ ని ఈరోస్ సంస్థ ఎప్పుడు తెరపైకి తీసుకొస్తుందో?

Similar News