వివాహానికి తొందరపడటం పూర్తిగా నా తప్పే

Update: 2017-05-31 11:36 GMT

గత దశాబ్ద కాలంలో ఎందరు సినీ తారలు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారో లెక్కే లేదు. వారిలో చాలా వైవాహిక జీవితాలు వారాంతాలలో హెడ్ లైన్స్ గా నిలిచాయి. మరి కొన్ని గుట్టు చప్పుడు కాకుండా చాలా హుందా గా విడాకుల వరకు చేరాయి. ఈ జాబితాలో నిన్నటి తరం బాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా ఒకరు.

2010 లో నేపాల్ కి చెందిన పారిశ్రామిక వేత్త సామ్రాట్ దహాల్ ని వివాహమాడి కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే విడాకులు అందుకుని మనీషా కొయిరాలా వైవాహిక జీవితానికి తెరదింపారు. ప్రస్తుతం 46 సంవత్సరాల వయసులో కూడా నటిగా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటున్న మనీషా కొయిరాలా ఇంత కాలానికి తన వైవాహిక జీవితం బెడిసికొట్టటానికి కారణాలు పంచుకుంటూ, "నా మనస్తత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో నేను నా వివాహానికి తొందర పడి నిర్ణయం తీసుకున్నాను. దానితో నేను వైవాహిక జీవితంలో కావలసిన సర్దుబాట్లు చేసుకోలేకపోయాను. అందువల్ల నా వైవాహిక జీవితం అతి తక్కువ కాలానికే ముగిసిపోయింది. అలా తొందర పాటు నిర్ణయాలు తీసుకోవటం పూర్తిగా నా తప్పే. ఈ విషయం లో మరెవరి తప్పు లేదు." అంటూ సెలవిచ్చింది మనీషా కొయిరాలా.

ప్రస్తుతం మనీషా కొయిరాలా బాలీవుడ్ లో సంజయ్ దత్ బియోపిక్ లో నర్గీస్ పాత్ర పోషిస్తుంది. మరో వైపు డియర్ మాయ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

Similar News