విభిన్న పాత్రలతో అమ్మడికి ఈ ఏడాది కేలండర్ నిండిపోయింది

Update: 2017-02-07 12:19 GMT

వరుణ్ సందేశ్ నటించిన మిర్చి లాంటి కుర్రోడుతో వెండితెరకి పరిచయం అయినప్పటికీ ప్రగ్య జైస్వాల్ కి 2015 లో క్రిష్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన కంచె చిత్రంలోని సీత పాత్ర తోనే అటు పరిశ్రమ వర్గాలలో ఇటు ప్రేక్షకులలోనూ గుర్తింపు వచ్చింది. కంచె క్రేజ్ తో బాగా పాపులర్ ఐన ప్రగ్య జైస్వాల్ కి వరుస అవకాశాలు తలుపుతట్టినప్పటికీ విడుదలలు పరంగా చూసుకుంటే ప్రగ్య కి 2016 పూర్తిగా బ్లాంక్ కేలండర్ గానే మిగిలిపోయింది. కానీ ప్రగ్య 2016 ద్వితీయార్ధంలో పూర్తిగా షూటింగ్స్ లోనే గడిపింది. దాని ఫలితంగానే ఈ ఏడాది వరుసగా ప్రేక్షకులను వైవిధ్యమైన పాత్రలతో పలకరించనుంది.

ఈ నెల 10 వ తారీఖున ప్రగ్య జైస్వాల్ ముఖ్య భూమిక పోషించిన కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకుల ముందుకి వస్తుండగా ఈ చిత్రం విడుదలైన వారం వ్యవధిలోనే 17 న మంచు మనోజ్ సరసన ప్రగ్య జైస్వాల్ నటించిన లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరోడు చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న నక్షత్రం చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటించగా ఈ చిత్రాన్ని మార్చ్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలలో ఒక పాత్రకు మరొక పాత్రకు మధ్య ఎంతో వ్యత్యాసం కనపరిచే అవకాశం ప్రగ్య జైస్వాల్ కి దక్కటంతో పాటు మాస్ ఆడియెన్స్ కి చేరువ అయ్యే అవకాశం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానున్న బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ద్వారా దక్కనుంది. ఈ ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఇచ్చే బూస్ట్ అప్ తో వచ్చే ఏడాది ఎన్నిఅవకాశాలు దక్కించుకుంటుందో ప్రగ్య..

Similar News