‘రైతు’ కంటె ముందు బాలయ్య – పూరీతో చేస్తున్నారా?

Update: 2016-11-19 05:03 GMT

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రస్తుతం ఫినిషింగ్ దశలో ఉంది. దీని తర్వాత ఓ మూడు నెలల గ్యాప్ తర్వాత.. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న ‘రైతు’ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మరి ఈ మూడునెలల గ్యాప్ లో నందమూరి బాలయ్య విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని, మరో సినిమా చేసేస్తే ఎలా ఉంటుంది? ఇంత వేగంగా చేసేద్దాం అనే ఆలోచన మన ఇండస్ట్రీలో దర్శకుడు పూరీ జగన్నాధ్ కు తప్ప మరొకరికి రాదు. అందుకే కాబోలు.. ఆయన ప్రస్తుతం ఓ ఫాస్ట్ ట్రాక్ సినిమా చేయడానికి బాలయ్యను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది.

ఈ పుకార్లు పూర్తిగా కొత్తవేం కాదు. కొన్నాళ్ల కిందట కూడా ఇదే కబురు ముమ్మరంగా వినిపించి మళ్లీ సద్దు మణిగింది. తాజాగా ఈ కాంబినేషన్ లో చిత్రానికి సంబంధించి వర్క్ జరుగుతున్నట్లుగా మళ్లీ ఇండస్ట్రీలో కబుర్లు చెలామణీ అవుతున్నాయి.

పూరీ జగన్నాధ్ , నందమూరి కల్యాణ్ రామ్ తో చిత్రం చేసిన తర్వాత మరోటి ఏదీ చేయలేదు. కొత్తనటులతో చిత్రం అనీ, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని రకరకాల కథనాలు పూరీ చుట్టూ అల్లుకుని వినిపిస్తున్నాయి. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ – పూరీ తర్వాతి సినిమా చేయడానికి ముచ్చటపడ్డాడని కానీ ‘ఇజం’ కమర్షియల్ గా గొప్పగా ఆడకపోవడంతో.. వెనక్కు తగ్గాడని మరో టాక్ కూడా ఉంది.

అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న కబుర్ల ప్రకారం.. పూరీ జగన్నాధ్ – బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారుట. ఆయన ఓకే అంటే.. షూట్ కు కూడా రెడీ అవుతారుట. శాతకర్ణికి- రైతుకు మధ్య ఉండే గ్యాప్ లోనే దీన్ని పూర్తి చేస్తారుట. పూరీ మేకింగ్ స్టయిల్ కు సంబంధించి ఎవ్వరికీ అనుమానాల్లేవు. కాకపోతే బాలయ్యను మెప్పించే సబ్జెక్టును ఆయన సిద్ధం చేసుకుంటే.. ఏమో.. టాప్‌హీరో తో కూడా ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ సినిమా తయారవుతుందేమో.

Similar News