రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు దేవిశ్రీనే .....!

Update: 2016-04-01 15:18 GMT

చిరంజీవి చిన్న కుమార్తె వివాహం అయిపోయింది. కాగా ఇప్పుడు మెగాస్టార్‌ భుజానికి మరో ఆపరేషన్‌ చేయించుకొని, ఏప్రిల్‌ రెండో వారం నుండి తన 150వ చిత్రం ' కత్తి' రీమేక్‌లో జాయిన్‌ కానున్నాడు. కాగా గతంలో చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌, శంకర్‌ దాదా జిందాబాద్‌, అందరివాడు' వంటి చిత్రాలకు సంగీతం అందించిన సంగీత సంచలనం దేవిశ్రీనే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించే 100వ చిత్రం ఓ హిస్టారికల్‌ మూవీగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈచిత్రాన్ని తానే సొంతగా నిర్మించాలని క్రిష్‌ భావిస్తున్నాడట. మరీ ఓవర్‌ బడ్జెట్‌తో కాకుండా 40, 45కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో క్రిష్‌ ఉన్నట్లు సమాచారం. కాగా ఈచిత్రానికి కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నాడు. చారిత్రాత్మక చిత్రం కావడంతో మంచి రీరికార్డింగ్‌కు ప్రాధాన్యం ఉండే ఈ చిత్రానికి మొదట ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ వంటివారి పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరకు దేవిశ్రీకే ఆ బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉగాదినాడు రానుంది.

Similar News