రూటు మార్చి సినిమాల జోరు పెంచేసిన గౌతమ్

Update: 2017-01-13 17:42 GMT

గత ఏడాది నవంబర్ లో విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఫస్ట్ కాపీ ని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దాదాపు పది నెలల క్రితమే సిద్ధం చేసేసాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యం అవటంతో గౌతమ్ మీనన్ కి బాగా గ్యాప్ వచ్చింది. సాధారణం గానే ఏడాది పాటు స్క్రిప్ట్ పనులలో, మరో ఏడాది పాటు చిత్తాన్ని సెట్స్ పై ఉంచే గౌతమ్ సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదలైన రెండు నెలలకే తమిళ నటుడు ధనుష్ తో ఎన్నై నొక్కి తోటా పాయం చిత్రాన్ని పూర్తి చేసేసాడు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో ప్రేక్షకులను పలకరించటానికి సన్నద్ధమవుతుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుండగానే గౌతమ్ మీనన్ తన తదుపరి చిత్ర పోస్టర్స్ విడుదల చేసేసాడు.

మూడు సంవత్సరాల క్రితం సూర్య హీరోగా తెరకెక్కించాలనుకున్న ధర్మ నక్షత్రం కోసం అప్పుడే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. అప్పటి షెడ్యూల్స్ కొన్ని డిలే అవటంతో విసిగిన సూర్య చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఆ ప్రాజెక్ట్ నుంచి బైటకి వచ్చేసాడు. అనంతరం ఎన్నై ఆరిందాల్, సాహసం శ్వాసగా సాగిపో, ఎన్నై నొక్కి తోటా పాయం చిత్రాలతో బిజీ అయిపోయిన గౌతమ్ ఇప్పుడు తిరిగి ధర్మ నక్షత్రం పై తన దృష్టిని కేంద్రీకరించాడు. అయితే సూర్య బదులు విలక్షణ నటుడు విక్రమ్ తో ఈ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించిన గౌతమ్ ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేసాడు. ఈ పోస్టర్స్ లో విక్రమ్ చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఫిబ్రవరి నెల లో ఈ చిత్రం రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి ఈ ఏడాది నవంబర్ కి చిత్రాన్ని విడుదల చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు గౌతమ్ మీనన్. రెండేళ్ళకి ఒక సినిమా చేసే గౌతమ్ కూడా ఏడాదికి రెండు చిత్రాలు చేసేస్తున్నాడు.

Similar News