రానా సినిమాకి అమితాబ్, చిరు, సూర్య

Update: 2017-01-29 08:30 GMT

2010 లో ఏ.వి.ఎం సంస్థ వారి లీడర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రానా దగ్గుబాటి అనతి కాలంలోనే తాను కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి పరిమితమయ్యే నటుడిని కాదని నిరూపించుకున్నాడు. దమ్ మరో దమ్, డిపార్ట్మెంట్, బేబీ వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రానా, బెంగుళూరు నత్తకాల్ తో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక బాహుబలి ది బిగినింగ్ చిత్రం లో పండించిన విలనిజానికి భళ్లాల దేవుడిగా రానా ఇమేజ్ సముద్రాలు దాటేసింది. బాహుబలి 2 నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉండగానే రానా దగ్గుబాటి నటించిన ఘాజి చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఫెబ్రవరి 17 న విడుదలకు సిద్ధం అవుతోంది. 1971 లో జరిగిన యుద్ధం నేపధ్య కథతో సాగే ఈ చిత్రం భారతీయ చలన చిత్రాలలో తొలి సబ్ మెరైన్ ఫిలిం గా చరిత్రలో నిలిచిపోనుంది.

చారిత్రక కథ ని ఆవిష్కరించే చిత్రం కావటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే పెరిగాయి. ఈ అంచనాలకి ఊతమిస్తూ తాజాగా ఘాజి చిత్రానికి సంబంధించి మరో సంచలన వార్త వెలువడింది. ఘాజి చిత్రం లో వాయిస్ ఓవర్ లో కథ ని నేరేట్ చేసే వాయిస్ లు కూడా ఘాజి చిత్రానికి అదనపు బలం కానున్నాయి. హిందీ వెర్షన్ లో స్టోరీ నేరేట్ చేసే వాయిస్ కి డబ్బింగ్ బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్తుండగా, తెలుగు వెర్షన్ కి మెగా స్టార్ చిరంజీవి, తమిళ వెర్షన్ కి సూర్య లు తమ గొంతు అరువు ఇవ్వనున్నారట. ఇప్పటికే ట్రైలర్ తో ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తిస్తున్న ఘాజి చిత్రానికి మూడు భాషలలోను ముగ్గురు హ్యూజ్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇవ్వటంతో ఘాజి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Similar News