రాజ్‌తరుణ్‌తో సర్దుకుపోతోంది...!

Update: 2016-03-30 15:34 GMT

'అలియాస్‌ జానకి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్‌ అనీషా ఆంబ్రోస్‌. ఆ తర్వాత ఆమెకు పవన్‌కళ్యాణ్‌ తన 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడనే వార్తలు రావడంతో అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది. పవన్‌, వెంకటేష్‌ల 'గోపాల...గోపాల' చిత్రంలో ఆమెకు చిన్న పాత్రలో అవకాశం ఇచ్చాడు పవన్‌, ఈ సినిమా చూసిన వారు ఆమెకేమిటి? పవన్‌ తన సినిమాలో అవకాశం ఇవ్వడం ఏమిటి? ఆమెకు అంతసీన్‌లేదని తేల్చేశారు. దాంతో ఆమెను పక్కనపెట్టిన పవన్‌ బాబి దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్దార్‌' చిత్రంలోకి కాజల్‌ను తీసుకోవడంతో పవన్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఆమె సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన 'రన్‌' చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. అయినా కూడా అనీషాఆంబ్రోస్‌కు తాజాగా మరో సినిమాలో అవకాశం లభించింది. రాజ్‌తరుణ్‌ హీరోగా నాని అనే నూతన దర్శకునితో ప్రారంభం కానున్న ఓ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. త్వరలో ఈచిత్రం పట్టాలెక్కనుంది. మొత్తానికి పవన్‌తో చేసే అవకాశం మిస్‌ చేసుకున్న ఈ అమ్మడు సందీప్‌కిషన్‌, రాజ్‌తరుణ్‌ వంటి యంగ్‌ హీరోలతో సర్దుకుపోతోంది.

Similar News