ముఖ్యమంత్రి మెచ్చిన "మహానటి"

Update: 2018-05-26 12:11 GMT

వైజయంతీ మూవీస్ పతాకంపై కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం "మహానటి". నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రరాజాన్ని ప్రతి తెలుగు ప్రేక్షకుడు మెచ్చి అఖండ విజయాన్ని అందించాడు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవల వీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు (మే 26) అమరావతిలో ఓ ప్రత్యేకమైన అభినందన సభ నిర్వహించి మరీ "మహానటి" బృందాన్ని సత్కరించారు.

అద్భుతంగా తీశారు...

సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. "శ్రీమతి స్వప్నదత్, శ్రీమతి ప్రియాంక దత్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకొని అఖండ విజయం సాధించారు. నాగఅశ్విన్ దాదాపు రెండేళ్లు ఈ సినిమా మీద వర్క్ చేయడం, ఎంతో మందితో డిస్కస్ చేసి అందరూ లీనమయ్యే స్థాయిలో సినిమా తీశాడు. రెండో సినిమాతోనే ఇంత అద్భుతమైన సినిమా తీయడం అనేది ప్రశంసార్హం. సావిత్రిగా కీర్తిసురేష్ అద్భుతంగా నటించారు. సావిత్రితో కలిసి కీర్తి సురేష్ జర్నీ చేసారేమో అనిపించేంతలా ఆమె ఈ చిత్రంలో బ్రహ్మాండంగా నటించారు. సావిత్రి గారి కుమార్తె కిజాయ చాముండేశ్వరి ఈ చిత్రం కోసం తనకు తెలిసిన ఇన్ఫో ఇవ్వడం మొత్తం ఇచ్చి సహకరించడం విశేషం. 16 ఏళ్లకి సినిమాల్లోకి ఎంటరైన సావిత్రిగారు దాదాపు 30 ఏళ్లపాటు సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసి 46 ఏళ్లకి తుది శ్వాస విడిచారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆమె జీవితంలో సక్సెస్ ఫుల్ అవ్వడం అనేది స్పూర్తిదాయకం. అలాగే అద్భుతమైన నటి, అఖండమైన ఆత్మవిశ్వాసం, అంతులేని ఔదార్యం కలిగిన ఓ వ్యక్తి, మంచితనానికి మారుపేరు లాంటి మహానటి సావిత్రిగారి జీవితాన్ని ఆవిష్కరించడం అనేది చిన్న విషయం కాదు ఈరోజుల్లోనే కాదు భవిష్యత్ లోనూ ఇలాంటి సినిమా రావడం అనేది చాలా కష్టం. అందుకే రాష్ట్రప్రజలందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నాను" అన్నారు.

గర్వంగా ఉంది...

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. "ఏదో చిన్న రూమ్ లో మమ్మల్నందర్నీ కలిసి అభినందిస్తారేమో అనుకున్నాను కానీ.. ఈ స్థాయిలో పెద్ద సభ నిర్వహిస్తారని ఎక్స్ పెక్ట్ చేయలేదు. సావిత్రిగారు మనకు దొరికిన పెద్ద ట్రెజర్. " అన్నారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. "మన తెలుగు గడ్డ మీద మన తెలుగు సినిమాకి గర్వకారణమైన అమ్మ సావిత్రిగారి జీవితం ఆధారంగా చేసుకొని తెలుగు టెక్నీషియన్స్ అందరూ కలిసి "మహానటి" చిత్రాన్ని తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ పుట్టిన గుంటూరులో అమ్మ సినిమాకి జరుగుతున్న సన్మానం ఇది. చాలా గర్వంగా ఉంది. ఇప్పట్నుంచి మా అమ్మని చూసుకోవాలి అనిపించినప్పుడల్లా కీర్తి సురేష్ ను చూసుకుంటే సరిపోతుంది" అన్నారు. దర్శకుడు నాగఅశ్విన్ మాట్లాడుతూ.. "తెలుగువాళ్ళందరూ గర్వపడేలా ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. " అన్నారు.

Similar News