మలయాళ ముద్దుగుమ్మకు వరస ఆఫర్లు...!

Update: 2016-03-19 23:35 GMT

మలయాళంలో 'ప్రేమమ్‌' చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న భామ అనుపమపరమేశ్వరన్‌. ఎక్కడ మంచి హీరోయిన్‌ ఉంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడంలో మన హీరోలు, దర్శకనిర్మాతలు ముందుంటారు. కాగా ఆమె ప్రస్తుతం 'ప్రేమమ్‌' తెలుగు రీమేక్‌లో మలయాళంలో తాను పోషించిన పాత్రనే పోషిస్తోంది. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'అ..ఆ' చిత్రంలో కూడా ఆమె సమంతతో కలిసి రెండో హీరోయిన్‌ పాత్రను చేస్తోంది. కాగా ఆమెకు ఇప్పుడు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. సాధారణంగా దిల్‌రాజు చిత్రాల్లో నటించాలని హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా దిల్‌రాజు సతీష్‌ వేగ్నేష దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌ హీరోగా 'శతమానం భవతి' చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ ఎంపికైందని సమాచారం. అలాగే ఆమెకు మరికొన్ని మంచి సినిమాల అవకాశాలు వస్తుండటంతో వీటిని ఎంచుకోవడంలో ఆమె ఆచితూచి అడుగులు వేస్తోంది. మొత్తానికి ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఈ చిన్నది పలు ఆఫర్లను పొందుతుండటం విశేషంగా చెప్పాలి.

Similar News