మరో మలయాళం బ్యూటీ తో జతకట్టనున్న నాచురల్ స్టార్

Update: 2017-02-10 21:00 GMT

వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రొడ్యూసర్స్ హీరోగా మారిపోయిన నాచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం నేను లోకల్ సక్సెస్ ఇచ్చిన కిక్ తో తన తదుపరి ప్రాజెక్ట్స్ పనులని వేగవంతం చేసేస్తున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మాన్, మజ్ను, నేను లోకల్ చిత్రాలతో డబల్ హ్యాట్రిక్ సక్సెస్లు అందుకున్న నాని కి ఇప్పుడు అన్నీ పెద్ద నిర్మాణ సంస్థల నుంచే ఆఫర్స్ వస్తున్నాయి. వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్విని దత్ తన బ్యానర్ లో రానున్న చిత్రాలలో ఒక చిత్రం నాని కథానాయకుడిగా నిర్మించనుండగా, దిల్ రాజు ఇప్పటికే నానితో తీయబోయే చిత్రానికి కథ లాక్ చేసేసుకున్నారు.

గతంలో అలా మొదలైంది తో మళయాళ భామ నిత్య మీనన్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన నాని, ఇటీవలి కాలంలో జెంటిల్ మాన్ చిత్రంతో మరో మళయాళ భామ నివేత థామస్ కి తన కోస్టార్ గా అవకాశం ఇచ్చి ఆ చిత్రంతోనూ సక్సెస్ అందుకున్నాడు. కాగా నాని తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న వేణు శ్రీ రామ్(ఓ మై ఫ్రెండ్ ఫేమ్) తొలుత నాని సరసన మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ని ఫిక్స్ చేసుకున్నప్పటికీ పారితోషికాల విషయంలో సఖ్యత కుదరక అనుపమ ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగటంతో వేణు శ్రీరామ్ నాని సరసన నటించటానికి మళయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి ని సంప్రదించాడట. కథ, తాను పోషించబోయే పాత్ర బాగా నచ్చటంతో సాయి పల్లవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కాల్ షీట్స్ అద్జుస్త్ చేయటానికి కొంత సమయం కోరిందట. ప్రస్తుతం ఏకకాలంలో ఫిదా చిత్రంతో పాటు మరో తమిళ చిత్ర షూటింగ్లలో పాల్గొంటున్న కారణాన డేట్స్ ప్లాన్ చేసి చెప్తానని మాట ఇచ్చి, డేట్స్ లాక్ ఐన తరువాతే అగ్రిమెంట్ సైన్ చేస్తానని కూడా చెప్పిందట.

Similar News