భారీ ప్రాజెక్ట్‌ను పట్టేసిన పూరీ..!

Update: 2016-03-12 14:22 GMT

దర్శకుడు పూరీజగన్నాథ్‌ స్టైలే వేరు. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండడు. అలాగే చిన్నపెద్ద తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం ఆయన నైజం. అంతేకాదు ఆయనకు బాషా భేదాలు కూడా లేవు. అదే ఇప్పుడు వర్కౌట్‌ అవుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయనకు బాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ సెట్‌ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఖరారు చేశాడు. పూరీ మాట్లాడుతూ.. అవును... నేను సంజయ్‌దత్‌తో ఓ హిందీ చిత్రం చేయబోతున్నాను. 'రోగ్‌' చిత్రం అనంతరం ఈ సినిమా ఉంటుంది. సంజయ్‌దత్‌కు నా స్క్రిప్ట్‌ వినిపించాను. ఆయన చాలా ఇష్టపడ్డారు... అని తెలిపాడు. ప్రస్తుతం పూరీ 'రోగ్‌' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈమధ్య పూరీతో గొడవపడి దూరమైన చార్మి తాజాగా మరలా పూరీ కాంపౌండ్‌లోకి వచ్చి ఈ 'రోగ్‌' చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ్‌ను

పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగుభాషల్లో నిర్మిస్తున్నాడు. గతంలో కూడా ఆయన బాలీవుడ్‌లో అమితాబ్‌బచ్చన్‌తో, కన్నడలో పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అప్పు' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వరుణ్‌తేజ్‌తో 'లోఫర్‌' తర్వాత ఈ 'రోగ్‌' పనిలో పడ్డాడు. ఈ చిత్రం తర్వాత సంజయ్‌దత్‌ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి పూరీ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం.

Similar News