బాబు ద్విపాత్రానభినయం చేస్తున్నాడా?

Update: 2017-10-16 13:00 GMT

తెలుగులో విలన్ గా, హీరోగా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఇరగదీసిన మోహన్ బాబు ప్రస్తుతానికి సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు అనలేం గాని సినిమాలు చేసే వేగాన్ని మాత్రం తగ్గించాడు. 30 ఏళ్ళ పాటు విరామం లేకుండా నటించి ప్రస్తుతానికి సెలెక్టెడ్ గా కాకుండా అతి తక్కువ సినిమాలు చేస్తున్నాడు. విష్ణు హీరోగా మోహన్ బాబు రౌడీ సినిమా తర్వాత ప్రస్తుతానికి గాయత్రీ సినిమాలో నటిస్తున్నాడు. మోహన్ బాబు మెయిన్ లీడ్ లో పెళ్లైన కొత్తలో ఫేమ్ మదన్ దర్శకత్వంలో గాయత్రీ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో ఈ మధ్యనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిఖిల ముఖ్యపాత్రలో నటిస్తుంది.

ఇకపోతే ఈ గాయత్రీ చిత్రంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక ద్విపాత్రాభినయం అంటే ఏ తండ్రి, కొడుకులుగానో.. లేకుంటే అన్నదమ్ములుగానో కాదండోయ్.... ఒక పాత్ర హీరో పాత్ర అయితే మరొక పాత్ర విలన్ పాత్ర అంటున్నారు. మరి మోహన్ బాబు హీరోగా, విలన్ గా ఎలా కనిపించాడో అనేది గతంలోనే తెలుసు. మోహన్ బాబు విలనిజాన్ని కామెడీతో కలిపి పండించేవాడు. హీరోగా కూడా ఆరడుగుల అందగాడిగా మెప్పించేవాడు. మరి ఇలా ఒకే సినిమాలో హీరో, విలన్ కేరెక్టర్స్ అంటే మాత్రం మోహన్ బాబు ఎలా కనబడతాడో అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉంది.

లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న ఈసినిమాలో నిఖిల, మెహన్ బాబుకి కూతురిగా కనబడనుందట. ఇక మోహన్ బాబు హీరో, విలన్ పాత్రలు రెండు నడివయసు పాత్రలు అంటున్నారు.

Similar News