పాత్ర డిమాండ్ చేసినా లావు అవటం కుదరదు

Update: 2016-12-15 10:09 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎందరు కథానాయికలు వచ్చి వెళ్తున్నా మహా నటి సావిత్రి గారి నట రాజసం మరెవరికి రాదు అనటం లో అతిశయోక్తి లేదు ఏమో. హావభావాల ద్వారా అనేకానేక కీలక సన్నివేశాలను సునాయాసంగా రక్తి కట్టించిన సందర్భాలు కోకొల్లలు. నాటి తరం కథానాయికలు శరీరాకృతి కంటే కూడా అభినయానికే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. సావిత్రి గారు కూడా బొద్దుగా ఉంటూనే పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాలలో మెప్పించారు. నేటి తరం వారికి అంతటి మహానటి జీవిత కథను సినిమా రూపంలో చెప్పటానికి ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తనయురాలు ప్రియాంక దత్ నిర్మాణంలో అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించటానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు.

తొలి నుంచి నిత్య మీనన్ ఈ చిత్రంలో సావిత్రి గారి పాత్రలో నటిస్తుంది అని వార్తలు వెలువడినప్పటికీ అనూహ్యంగా నాగ్ అశ్విన్ సమంత తో చర్చలు జరిపి లీడ్ రోల్ ఆఫర్ చేశారు. ఆఫర్ తో పాటు సమంతకు ఒక షరతు కూడా విధించారు దర్శకుడు. మహానటి పాత్రలో ఆవిడ రూపాన్ని ప్రతిబింబించే విధంగా బరువు పెరగాలి అని సూచన లాంటి షరతు విధించారు నాగ్ అశ్విన్. పెర్ఫార్మన్స్ విషయంలో ఎంతటి సహకారమైనా అందిస్తాను కానీ పర్సనాలిటీ విషయంలో మాత్రం ఎవరి సూచనలు పాటించను అని తేల్చి చెప్పేసింది అంట సమంత. ఇక తప్పేది లేక మేకర్స్ మళ్లీ బొద్దుగుమ్మ నిత్య మీనన్ తోనే సంప్రదింపులు జరుపుతున్నారు.

నిత్య మీనన్ తో అభినయానికి సమంత ఏ మాత్రం పోటీకి సరిపడదు అని నమ్మిన పలువురు సావిత్రి అభిమానులు మహానటి సావిత్రి గారి పాత్ర తిరిగి తిరిగి నిత్య మీనన్ వద్దకే వెళ్లటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News