పవన్‌ సినిమాలపై ఆసక్తి...!

Update: 2016-03-15 14:43 GMT

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ప్రస్తుతం 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌ 8న తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలకానుంది. కాగా తాను మరో మూడు నాలుగు సినిమాలు చేసిన తర్వాత నటనకు స్వస్తి చెబుతానని, తన దృష్టినంతా రాజకీయాలపై తన పార్టీ 'జనసేన' పై పెడతానని, 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్‌ తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో పవన్‌ చేయబోయే తదుపరి చిత్రాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. కాగా 16ఏళ్ల కిందట వచ్చిన 'ఖుషీ' చిత్రానికి సీక్వెల్‌ను పవన్‌ 'సర్దార్‌' తదుపరి చిత్రంగా ఖాయమైందని అంటున్నారు. కాగా ఈచిత్రం ప్రీప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కావడంతో అది నిజమేనని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ముంబైలో జరుగుతున్నాయని పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి ట్వీట్‌ చేసి దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్‌ చేశాడు. ఈ మ్యూజికల్‌ సిట్టింగ్స్‌లో రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌, దర్శకుడు ఎస్‌.జె.సూర్య పాల్గొంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుంందని తెలుస్తోంది. ఆమె కూడా పూణె నుండి తరచుగా ముంబై వస్తూ ఈ మ్యూజికల్‌ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నదట. తాను త్వరలో రాజకీయాలలోకి వెళ్తున్న నేపథ్యంలో రేణు దేశాయ్‌ని, ఆమె వద్ద పెరుగుతున్న తన పిల్లలకు ఆర్ధికంగా స్దిరపడేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే పవన్‌ ఈచిత్రాన్ని రేణుదేశాయ్‌కు చేస్తున్నట్లు సమాచారం. ఇక 'ఖుషీ' తర్వాత ఎస్‌.జె. సూర్య పవన్‌తో 'కొమరం పులి'లాంటి డిజాస్టర్‌ను ఇచ్చాడు. కాగా 'ఖుషీ' సమయంలో పవన్‌ కుర్రాడు కాబట్టి లవ్‌స్టోరికి సరిగ్గా సూట్‌ అయ్యాడు. కానీ ఇప్పుడు పవన్‌కు ఉన్న క్రేజ్‌ వేరు. రాజకీయనాయకుడు కూడా కావడంతో 'ఖుషీ' సీక్వెల్‌లో పవన్‌ను సూర్య ఎలా చూపిస్తాడు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది. మొత్తానికి పవన్‌ తన చిత్రాలన్నింటిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రం మిస్‌ కాకూడదని భావిస్తున్నాడట.

Similar News