నిర్మాతగా మారుతున్న మరో కుర్ర హీరో

Update: 2017-02-09 12:14 GMT

ప్రస్తుత తరం యువ కథానాయకులలో అధిక మంది యాక్టింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా ఇతర విభాగాలలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే దారిలో అడుగులు వేయబోతున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. గత ఏడాది విడుదలైన జ్యోఅచ్చుతానంద చిత్రంతో సాధించిన సక్సెస్ నుంచి సెలెక్టివ్ గా సినిమాలు ఒప్పుకుంటున్న నాగ శౌర్య ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ని స్థాపించబోతున్నాడు. కథానాయకుడిగా నటిస్తూనే మరో పక్క నిర్మాతగానూ పరిచయం కాబోతున్న నాగ శౌర్య తన నిర్మాణ సంస్థలో నిర్మితమయ్యే చిత్రాల నిర్మాణ వ్యవహారాలన్నీ తన తండ్రి శంకర్ ప్రసాద్ నేతృత్వంలో జరుగుతాయని నాగ శౌర్య సన్నిహితుల నుంచి వినిపిస్తున్న వార్త.

నాగ శౌర్య తన సొంత నిర్మాణ సంస్థలో తీయబోయే తొలి చిత్రంలో తానే కథానాయకుడిగా నటించనున్నాడట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పలు సినిమాలకు పని చేసిన వెంకట్ అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా చేయబోతున్నాడట నాగ శౌర్య. ఈ చిత్రం విడుదలైన అనంతరం తన నిర్మాణంలో ఇతర కథానాయకులతోనూ సినిమాలు తీస్తూ, కొత్త దర్శక రచయితలకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కలిపిస్తూ పరిమిత వ్యయాలతో వినూత్న కాన్సెప్ట్స్ ని వెండితెరకి ఎక్కించాలని యోచిస్తున్నాడట నాగ శౌర్య.

Similar News