నాలుగో షెడ్యూల్ ప్రారంభమైన డీజే

Update: 2017-01-06 03:41 GMT

2016 లో సరైనోడు వంటి మాంచి మాస్ మసాలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కి మాస్ ప్రేక్షకులు, మెగా అభిమానులు బ్రహ్మ రథం పట్టారు. సరైనోడు చిత్రం 74 కోట్ల రూపాయల పై చిలుకు వసూళ్లు రాబట్టి అల్లు అర్జున్ కి కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా రికార్డు సాధించింది. సరైనోడు చిత్రీకరణ దశలోనే లింగుసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో బైలింగువల్ చిత్రం చేయటానికి అంగీకరించిన అల్లు అర్జున్ సరైనోడు విజయ సంబరాల అనంతరం లింగుసామి చిత్రానికి కాల్ షీట్స్ కేటాయించకుండా హరీష్ శంకర్ చెప్పిన కథని ఓకే చేస్తూ వెను వెంటనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు అల్లు అర్జున్. వరుసగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న దువ్వాడ జగన్నాథం షెడ్యూల్స్ కి డేట్స్ సర్దుబాటు చేసేసి ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసేశాడు.

రెండు మాసాల క్రితం అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి ల జంట ఒక ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో నాటి నుంచి అల్లు అర్జున్ తన చిత్రీకరణల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులతోనే గడుపుతూ తన కూతురు ఆరా అర్జున్ ని ఆడిస్తూ గడిపాడు. ఇటీవల నూతన సంవత్సర వేడుకలు కూడా కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్న అల్లు అర్జున్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం చివరి షెడ్యూల్ ఐన నాలుగవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్ మొత్తం హైద్రాబాద్ మరియు నగర పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ చేసుకోనుంది. చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరగనుంది.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, ముకుంద, ఒక లైలా కోసం, మోహీనజాడరో లతో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న పూజ హెగ్డే, అల్లు అర్జున్ సరసన చేస్తున్న ఈ చిత్రంతో తొలి సక్సెస్ నమోదు చేయాలని ఆశపడుతోంది.

Similar News