నాగ్ తో మరోసారి బాలీవుడ్ స్టార్

Update: 2017-11-13 14:00 GMT

రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకన్నా ఎక్కువగా... నాగ్ తో తియ్యబోయే సినిమా విషయమై హైలెట్ అవుతున్నాడు. నాగార్జున తో యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేసిన వర్మ ఈ సినిమాని ఈనెల 20 నుండి పట్టాలెక్కించబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ముహూర్తం షాట్ తో సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలతో పాటే.. 10 రోజుల పాటు షూటింగ్ ని కంటిన్యూ చేయనున్నారని తెలుస్తుంది. గత పదేళ్లుగా విజయానికి ఆరోమెట్టు అన్నట్టు వరుస పరాజయాలతో సతమతమవుతున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని... తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరో పక్క నాగార్జున కూడా వర్మ మీద భారీ ఆశల తోపాటు... భారీగా నమ్మకాన్ని కూడా పెట్టుకున్నాడు.

ఇకపోతే వర్మ - నాగ్ కలయికలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ఒక కీ రోల్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఇంతిలా స్ప్రెడ్ అవడానికి కారణం నాగార్జునకు, దర్శకుడు వర్మకు అమితాబ్ మంచి స్నేహితుడు కావడమే. నాగార్జున మీద ఉన్న అభిమానంతోనే అక్కినేని కుటుంబ చిత్రం మనం లో ఒక చిన్న రోల్ లో కనబడ్డారు అమితాబ్. కానీ ఇప్పుడు వర్మ - నాగ్ సినిమాలో ఒక కీ రోల్ లో అమితాబ్ నటిస్తున్నాడనే టాక్ మాత్రం గట్టిగానే వినబడుతుంది. ఈ విషయంపై నాగార్జున ఇప్పటికే అమితాబచ్చన్ తో మాట్లాడినట్లుగా కథనాలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి.

మరి యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తుండగా... అమితాబ్ కి ఎలాంటి పాత్ర ఇవ్వనున్నారో అనే విషయమై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మరోవైపు అమితాబచ్చన్ మెగా స్టార్ చిరంజీవి సై రా నరసింహరెడ్డి లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సై రా సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది మాత్రం క్లారిటీ లేదు.

Similar News