నాగ్ తో ఈ సారి శ్రీనివాస కళ్యాణం?

Update: 2017-02-23 07:56 GMT

ఈ నెల 10 న భారీ అంచనాల మధ్యన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్ర ఫలితం అక్కినేని నాగార్జున అభిమానులనే కాక, సామాన్య ప్రేక్షకులని, పరిశ్రమ వర్గాలకి నిరాశ కలిగించింది. అయితే కింగ్ నాగార్జున ఈ రిసల్ట్ పై అప్సెట్ అయినప్పటికీ ప్రస్తుతం తాను ఓంకార్ దర్శకత్వంలో నటిస్తున్న రాజు గారి గది-2 చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. మరో వైపు నిర్మాత దిల్ రాజు అక్కినేని నాగార్జున కోసం ఒక సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ కథని తయారు చేపించి ఇప్పటికే ఫస్ట్ నేరేషన్ కూడా ఇప్పించారని టాక్. సోగ్గాడే చిన్ని నాయనా వంటి డబల్ బ్లాక్ బస్టర్ ని నాగ్ కి ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ తో బంగారు రాజు అనే చిత్రం ప్లాన్ చేస్తున్న నాగార్జున డేట్స్ ని దిల్ రాజు కబ్జా చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనకి నాగ్ కోసం సిద్ధం చూపించిన కథపై అంత గురి ఏర్పడిందట.

ఈ ఏడాది సంక్రాంతి పండుగకి ఇద్దరు స్టార్ హీరోస్ ప్రతిష్టాత్మక చిత్రాలతో పోటీ పడి కూడా నెగ్గుకు వచ్చి బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న శతమానం భవతి చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ నాగార్జున కోసం ఈ కథని రచించారు. దొంగల బండి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ వేగేశ్న కి తొలి ప్రయత్నం బెడిసి కొట్టటంతో దర్శకుడిగా చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ని బ్రేక్ చేస్తూ దిల్ రాజు శతమానం భవతి తో ఇచ్చిన సదావకాశాన్ని వినియోగించుకుని సూపర్ హిట్ డైరెక్టర్గా నిరూపించుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలోనే తన మూడవ చిత్రం కూడా ఉండబోతుందని ఇప్పటికే ఖరారైనప్పటికీ నాగార్జున అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు వినికిడి. ఒకవేళ నాగార్జున ఈ ప్రాజెక్ట్ ని తిరస్కరిస్తే దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎవరితో నిర్మిస్తారో చూడాలి.

Similar News