నా మార్కెట్ స్టామినా కి మించిన బడ్జెట్ తో

Update: 2017-01-27 19:30 GMT

ఎస్.ఎస్.రాజమౌళి చేసిన గ్రాండ్ వెంచర్ బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా కి వచ్చిన గుర్తింపు తో తెలుగు సినిమా మార్కెట్ బాగా విస్తృతమైయ్యింది. విదేశాలలో చిన్న హీరోల చిత్రాలు కూడా మిలియన్ డాలర్ల క్లబ్లో చేరుతున్నాయి. అయినప్పటికీ మరో వైపు కథ, కథానాయకుడి మార్కెట్ కి పొంతన లేకుండా నిర్మితమవుతున్న కొన్ని చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్ కావటం చూస్తూనే వున్నాం. నిర్మాత గా అనుభవమున్న యువ హీరో మంచు విష్ణు మాత్రం ఇప్పటి వరకు తన సినిమాలు 20 కోట్ల రూపాయల షేర్ కూడా వసూళ్లు చేయనప్పటికీ తన తదుపరి ప్రాజెక్ట్స్ లో ఒక చిత్ర నిర్మాణానికి ఏకంగా 45 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు.

దాదాపు రెండు సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో భక్త కన్నప్ప రీమేక్ పై వార్తలు వినపడుతున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్ లో ప్రభాస్ హీరోగా కృష్ణం రాజు నిర్మించాలనుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాకపోవటంతో ఈ ప్రాజెక్టులోకి మంచు విష్ణు వచ్చారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కుతోందని అధికారిక ప్రకటన జరిగిన చాలా కాలం గడిచినప్పటికీ భక్త కన్నప్ప మాత్రం ఇప్పటికీ పట్టాలెక్కకపోవటంతో ఈ ప్రాజెక్ట్ ఇక ముగిసిపోయినట్టే అని అందరూ భావించారు. కానీ మంచు విష్ణు తన లక్కున్నోడు చిత్ర విడుదల సందర్భముగా మీడియాతో మాట్లాడుతూ భక్త కన్నప్ప చిత్రాన్ని చేయబోతున్నట్టు మరో సారి స్పష్టత ఇచ్చాడు. అయితే తనికెళ్ళ భరణి కథ మాత్రమే అందిస్తారని, ఆయన దర్శకత్వ భాధ్యతలు చేపట్టరని కూడా వివరణ ఇచ్చిన విష్ణు ఈ చిత్ర బడ్జెట్ గురించి ప్రస్తావిస్తూ తన మార్కెట్ కి మించిన భారంతో తెరకెక్కించాల్సి వస్తున్నప్పటికీ కథ పై వున్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మంచు విష్ణు.

Similar News